ఆటో డ్రైవర్లకు లైసెన్సు తప్పనిసరి -సీఐ అంజూయాదవ్
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
ఆటో డ్రైవర్లకు లైసెన్సు తప్పనిసరని శ్రీకాళహస్తి 1వ పట్టణ సీఐ అంజూయాదవ్ చెప్పారు. శ్రీకాళహస్తి 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఆకస్మికంగా ఆటోలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె పలు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. డ్రైవింగ్ లైసెన్సు లేని వారికి జరిమానా విధించారు. ఈ సందర్భంగా అంజూయాదవ్ మాట్లాడుతూ... ప్రముఖ పుణ్య క్షేత్రమైన శ్రీకాళహస్తికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారన్నారు. ఆటోలను ఆశ్రయించే భక్తులను మోసం చేయకూడదన్నారు. ఆటో డ్రైవర్లు వారి పట్ల మర్యాదగా నడచుకోవాలని సూచించారు. భక్తులను మోసం చేసినట్లు ఫిర్యాదులు అందితే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక ఆటో డ్రైవర్లు ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరారు. రోడ్డు నియమాలు పాటిస్తే చాలా వరకు ప్రమాదాలు అరికట్టవచ్చని అంజూయాదవ్ అభిప్రాయపడ్డారు. డ్రైవింగ్ లైసెన్సు లేని వారికి అద్దెకు ఆటోలు ఇవ్వకూడదన్నారు. ఒకవేళ ఎవరైనా అలా చేస్తే ఆటో యజమానులపై కేసులు నమోదు చేస్తామని ఆమె హెచ్చరించారు. సరైన ధృవీకరణ పత్రాలు లేకుండా ఆటోలు నడపకూడదన్నారు. ధృవీకరణ పత్రాలు లేకుండా ఆటోలు తిప్పితే వాటిని సీజ్ చేస్తామన్నారు. ప్రజల శ్రేయస్సు కోసమో తాను ఈ సూచనలు చేస్తున్నట్లు అంజూయాదవ్ తెలిపారు. ఇక మాడవీధుల్లో ట్రాపిక్ నిబంధనలు పాటించాలని కోరారు. ఈమె వెంట ఎస్ఐ తిమ్మయ్య, ట్రాఫిక్ ఏఎస్ఐ రియాజ్ బాషా ఉన్నారు.
No comments:
Post a Comment